ఎన్టీఆర్ రాయలసీమకు దత్తపుత్రుడిగా ప్రకటించుకున్నారు: పురందేశ్వరి

బీజేపీ ఆధ్వర్యంలో కడపలో నిర్వహించిన రాయలసీమ రణభేరి సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాయలసీమలోని ఖనిజ సంపదను నాశనం చేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి రివర్స్ గేర్ లో వెళుతోందని విమర్శించారు. 

ఈ సందర్భంగా ఆమె తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రస్తావన తీసుకువచ్చారు. గతంలో ఎన్టీఆర్ రాయలసీమ కోసం ఎంతో కృషి చేశారని, ఆయన తనను రాయలసీమకు దత్తపుత్రుడిగా ప్రకటించుకున్నారని పురందేశ్వరి తెలిపారు. ఈ ప్రాంతంపై ఆయనకు ఎంతో ఆపేక్ష ఉండేదన్నారు. కానీ నేడు రాయలసీమ రాళ్ల సీమగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇది అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. 

ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, రాయలసీమకు జరిగిన అన్యాయానికి ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ బాధ్యత వహించాలని అన్నారు. రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులే ఈ పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అని పేర్కొన్నారు. రాయలసీమలో అడుగడుగునా సమస్యలేనని వివరించారు. ఇక్కడి సమస్యల పరిష్కారానికి బీజేపీ బాధ్యత తీసుకుంటుందని, పోరాటానికి సిద్ధం కావాలని కాషాయ శ్రేణులకు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. తమకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు ఉన్నాయని, ఇక్కడి పాలకులపై రణభేరి మోగిద్దామని కార్యకర్తలకు నిర్దేశించారు.

Daggubati Purandeswari
NTR
Rayalaseema
BJP
Andhra Pradesh

More Telugu News